ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని ఎందుకంటారు

ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని ఎందుకంటారు…మరి దక్షిణాయనం పుణ్యకాలం కాదా? అంటే..దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం. ఉత్తరాయణం పగటి సమయం. దేవతలు మేల్కొని ఉండే ఈ ఆరునెలల కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆరు నెలలు పూజలు, ఉపవాసాలు, తీర్థయాత్రలకు అనువైన సమయం అని చెబుతారు. ఉత్తరాయణంలో సూర్య సంచారం మొదలయ్యే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు.
శ్రీ మహావిష్ణువు యోగనిద్రనుంచి లేచి..ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని .. ఈ సమయంలో ఆచరించే పూజలు, ఉపవాసాలు విశేష ఫలితాన్నిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ విషయం అందరకీ తెలియజెప్పేందుకే మకర సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ సమయంలో ఇంటింటికి వచ్చే హరిదాసులు విష్ణు స్వరూపంగా, బసవన్నలు శివ స్వరూపంగా భావిస్తారు.
దక్షిణాయనం పితృదేవతల ఆరాధనకు మంచిది..అయితే ఉత్తరద్వారం తెరిచి దేవతలు నిద్రలేచే సమయం కావడంతో సంక్రాంతికి పితృ దేవతలకు తర్పణాలు విడుస్తారు. ఈ రోజు చేసే దానధర్మాలు రెట్టింపు ఫలితాన్నిస్తాయి.
