జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు

ప్ర : ఈ మధ్య గంగాకుంభమేళాలో అనేక నాగా సాధువులు,అఘోరీలు వచ్చారని వార్తలు టీవీల్లో, పత్రికల్లో వచ్చాయి.వీరి ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందనీ ,నాగాలు నగ్నంగా ఉంటారనీ, అఘోరీలు అంటే పరమఘోరంగా ప్రవర్తిస్తారనీ ‘హల్ చల్’, ‘హంగామా’ లాంటి పదాలతో వారిని వర్ణిస్తూ హిందూమతం పట్ల గౌరవం తగ్గేలా టీవీలు ప్రచారం చేశాయి.ఇలాంటి భయంకరాచారాలు మన మతంలో ఎందుకున్నాయి?
జ : హిందూధర్మం చాలా విశాలమైనది. ఇందులో ఎన్నో పంథాలు ఉన్నాయి. వారి వారి మనఃస్థితి బట్టి ఆ పంథాలను అనుసరిస్తారు.అఘోరీలు, నాగాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవారు కారు. మీరు ఎప్పుడూ ఉంటారు. కుంభమేళా లాంటి పవిత్ర పర్వాలలో పుణ్య నదులకు స్నానార్థం వచ్చినప్పుడు కనబడతారు. మన దృష్టిలో పడేందుకు వారు రారు. మీడియా రభసలవల్ల ఇప్పుడు కొంత మనకు వార్తలుగా తెలిసింది. నాగాల నగ్నత్వంగానీ, అఘోరీల ప్రవర్తనగానీ మనం అనససరించవలసినవి కావు. అలాగని వాటిని ‘జుగుప్స’ అని నిందించవలసినవీ కావు. అవి మనం జీవిస్తున్న సమాజానికి అతీతమైనవి. అందుకే వారు మనకు సాధారణ సామాజిక జీవితంలో గోచరించరు. వారి తత్త్వస్థాయి వేరు. వారి సాధనాపథం మన భౌతిక సామాజిక కోణాలలో ఇమిడేది కాదు. శరీరంతో తాదాత్మ్యంలేని ఎందరో యోగులు ఉన్నారు. ఆ యోగుల తత్త్వం మనకు అంతుపట్టదు.
ఇక ‘అఘోరీలు’ అంటేనే ‘ఘోరంలేని వారు’ అని అర్థం. వీరు క్షుద్రోపాసకులు కారు. మనకి ఈ సృష్టిలో కొన్ని ఘోరాలు- కొన్ని అఘోరాలు. కానీ వారికి ‘ఘోరం’ అనేదే లేదు. అంతా అఘోరమే. ‘అఘోరం’ అంటే ‘పరమఘోరం’ అని అర్థం లేదు. ‘ఘోరము కానిది- అఘోరం’. వారు ఎవరినీ హింసించరు. మనతో వారికి సంబంధం లేదు. మన దృష్టిలో పడినప్పుడు వారు మనకు జుగుప్స కలిగేలా ప్రవర్తిస్తారు. అయితే మనం వృధా అనుకున్నవీ, ఈసడించుకొనేవీ వారు స్వీకరిస్తారు. వారు ఎలాంటి పదార్థాన్నైనా పవిత్రంగా మార్చగలిగే శక్తి సంపన్నులు. వారు మనకు జుగుప్స అనిపించే వాటినే గ్రహించుతారు.అందులో హింస ఉండదు. వారి సాధనలు మనం అనుసరించలేము. అనుసరించాల్సిన ఆవశ్యకత కూడా లేదు. వారు కనిపిస్తే నమస్కరించవచ్చు. ఇంకా ఇలాంటి యోగులు, అతీంద్రియ శక్తి సంపన్నులు మన జనావాసాలకి దూరంగా, ఎక్కడుంటారో కూడా తెలియకుండా పవిత్ర పర్వత, అరణ్య, నదీ తీర ప్రాంతాలలో సంచరిస్తుంటారు. ఎప్పుడో కొన్ని పర్వ వేళల్లో వారు కనబడినా వారు మన ప్రపంచాన్ని పట్టించుకోరు. సామాన్య హిందువు వారివలె ప్రవర్తించినవసరం లేదు. అలాంటి తరహా యోగ సంప్రదాయాల సిద్ధులెందరో మనకు దూరంగా, దుర్గమంగా ఉంటారు. వారి ధర్మసరణి వేరు. లౌకిక జీవితం, కుటుంబ జీవనం కలవారి ధర్మ సంగతి వేరు. ఎందరో అవధూతలు, యోగులు ఇప్పటికీ మనకి అంతుపట్టకుండా జీవిస్తుంటారు. వారి గురించి పరిమిత జ్ఞానంతో కూడిన మనం వ్యాఖ్యానించడమే దోషం. ఇలాంటి వారు ఉండడం ఒక ఘనత. యోగులు, సిద్ధులు ఉన్న మతం హిందూ మతం.
