కార్తీక పురాణం – 17వ అధ్యాయము

అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము
ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.
కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పత్తికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను.
‘ఆత్మ’ యనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది – అని అంగీరసుడు చెప్పగా,
“ఓ మునీంద్రా! నేనింత వరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థజ్ఞానమునకు పాదార్థజ్ఞానము కారణమగుచుండును. కాన, ‘అహంబ్రహ్మ’ యను వాక్యార్థమును గురించి నాకు తెలియజెయండి” యని ధనలోభుడు కోరెను.
అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె –
ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే. ‘నేను – నాది’ అని చెప్పబడు జీవాత్మయే ‘అహం’ అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా ‘నః’ అను శబ్దము. ఆత్మకు షడ్భావవికారాలు లేవు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుండు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై ఎల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే “ఆత్మ” యనబడును.
“నేను” అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక, ఇట్టి దేహమునకు జాగ్రత్-స్వప్న-సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ “నేను”, “నాది” అని వ్యవహరించేదే ఆత్మ యని గ్రహించు కొనుము.
ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత ‘నేను సుఖనిద్రపోతిని, సుఖంగావుంది’ అనుకోనునదియే ఆత్మ.
దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే ‘పరమాత్మ’ అని గ్రహింపుము.
‘తత్త్వమసి’ మొదలైన వాక్యములందలి ‘త్వం’ అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శిష్టమందు జీవాత్మయని అర్థం. ‘తట్’ అను పదమునకు సర్వజ్ఞత్వాది విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. “తత్త్వమసి” అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును.
ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే “ఆత్మ”.
దేహలక్షణములు – జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు ఆరు భావములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో అదియే “ఆత్మ”.
ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మ యని తెలుసుకొనుము.
జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు అనియు, జీవులు కర్మ ఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము.
అందువలన మానవుడు గుణసంపత్తిగలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్ధియు, దానివలన భక్తి-జ్ఞాన-వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు – అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి సప్తదశాధ్యాయము – పదిహేడవ రోజు పారాయణ సమాప్తము
