గత తరం గౌరవం: ప్రేమ, విలువలు, జీవన శైలి – మన మూలాలను గుర్తు చేసుకోండి

చేతిలో ఫోన్ లేదు. జేబులో డబ్బు మోతాదు కాదు. ఇంట్లో ఏసీలు, కూలర్లు లేవు. అయినా సరే! ఆ తరం మనకంటే వందేళ్లు ఎక్కువ ఆనందంగా, ఎక్కువ ఆరోగ్యంగా జీవించింది. ఇది కేవలం నాస్టాల్జియా కాదు. ఇది ఒక నిజం. ప్రశ్న ఒక్కటే. అసలు వారి రహస్యం ఏమిటి? ఈ తరం వెళ్లిపోతే, మనకు ప్రేమను పంచే చేతులు ఉండవు. మన కథలను ఓపికగా వినే చెవులు ఉండవు. మన చిన్న విజయాలను చూసి కన్నీరు పెట్టే కళ్ళు ఉండవు. మన కళ్ల ముందే ఒక శకం నిశ్శబ్దంగా ముగిసిపోతోంది. మనకు జన్మనిచ్చిన, జీవితాన్ని నేర్పిన గొప్ప తరం ఒక్కొక్కరిగా శాశ్వత వీడ్కోలు చెబుతోంది. వారితో పాటు వారి విలువలు, వారి ఆప్యాయతలు, వారి జీవనశైలి కూడా నెమ్మదిగా మసక బారుతోంది. మనము ఏం కోల్పోతున్నామో నిజంగా తెలుసా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఆ తరం గొప్పతనం ఏమిటి? అది అన్నం తినే ముందు పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం. ఇల్లు చిన్నదిగా ఉండేది. కానీ మనుషుల మధ్య ప్రేమ విశాలంగా ఉండేది. వాళ్లు ఎప్పుడూ “నేను” అనలేదు. ఎప్పుడూ “మనము” అని జీవించారు. ఉమ్మడి కుటుంబాల్లో కష్టాలు పంచుకున్నారు. సుఖాలు పంచుకున్నారు. కన్నీళ్లను దాచుకోలేదు. ఆనందాన్ని దాచుకోలేదు. ఆస్తుల కంటే ఆప్యాయతలకు విలువ ఇచ్చిన తరం అది. డబ్బు కన్నా బంధాలు ముఖ్యమని నమ్మిన తరం.
వాళ్లకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉండకపోవచ్చు. కానీ, జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం అది. గడియారం లేకున్నా సూర్యుణ్ని చూసి సమయం చెప్పగలిగారు. క్యాలిక్యులేటర్ లేకున్నా నోటి లెక్కలతో లాభనష్టాలు చూసుకున్నారు. ఇంటర్నెట్ లేకున్నా అపారమైన జ్ఞానాన్ని నిల్వ చేసుకున్నారు. జీపీఎస్ లేకున్నా గమ్యాన్ని తప్పకుండా చేరగలిగారు. తెలివి అంటే మార్కులే కాదు అని వాళ్లు మనకు నేర్పారు. జ్ఞానం అంటే సమాచారం మాత్రమే కాదు, అనుభవమని చూపించారు. ఆ రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్ లేదు. కానీ, మనసు విప్పి మాట్లాడుకునే స్నేహాలకు లోటు లేదు. పోస్ట్ కార్డులపై రాసిన నాలుగు వాక్యాలు ఈరోజు గంటల కొద్దీ మాట్లాడే ఫోన్లకంటే ఎక్కువ ప్రేమను పంచేవి. ఎదురుగా కూర్చుని మాట్లాడేవారు. కళ్ళల్లోకి చూసి నవ్వేవారు. బాధ ఉంటే దాచుకోకుండా చెప్పేవారు. ఇప్పుడు మన దగ్గర ఫోన్లు ఉన్నాయి కానీ, మనుషుల మధ్య దూరం పెరిగింది. టీవీలు లేవు. ఓటిటి లేదు. యూట్యూబ్ లేదు. కానీ, వీధి నాటకాలు ఉన్నాయి. బుర్రకథలు ఉన్నాయి. హరికథలు ఉన్నాయి. మనుషులే వినోదం. మనుషులే సంబరాలు. ఏసీలు లేవు. కూలర్లు లేవు. ఆరుబయట మంచం వేసుకుని చల్లగాలిలో, జాబిల్లి వెలుగులో, హాయిగా నిద్రపోయిన తరం అది. మినరల్ వాటర్ తెలియదు. బావి నీళ్లు, చెరువు నీళ్లు తాగారు. రాళ్లు తిన్నా అరిగించే జీర్ణశక్తి వాళ్లది. పిజ్జాలు కాదు, బర్గర్లు కాదు, ప్యాకెట్ ఫుడ్ కాదు, పేలాలు, పీచు మిఠాయిలు, జొన్న రొట్టెలు, సజ్జ అన్నం. జిమ్లకు వెళ్లలేదు కానీ, రోజంతా చాకిరి చేసి, చెమట చిందించి, శరీరాన్ని దృఢంగా ఉంచుకున్నారు. అందుకే బీపీలు తక్కువ, షుగర్లు తక్కువ, హార్ట్ ఎటాక్లు అరుదు, కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేదు. ఆరు ఏళ్లు వచ్చే వరకు పిల్లల బాల్యం ఆటపాటలతో నిండేది.
ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడులు. అక్కడి నుంచి దేశానికి ఉపయోగపడే మనుషులు. టీచర్ దండిస్తే ఇంట్లో ప్రశ్నలు కాదు, ఇంట్లో మరో రెండు దెబ్బలు. క్రమశిక్షణే జీవితానికి పునాది. అందుకే ఆ తరం పిల్లలు దృఢంగా ఎదిగారు. బాధ్యతగా మారారు. వ్యాపారంలో కల్తీ లేదు. జీవితంలో మోసం లేదు. నీతి, నిజాయితీ వాళ్ల శ్వాస. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. త్యాగాలతో పిల్లల భవిష్యత్తును నిర్మించారు. కులమతాలకు అతీతంగా అందరినీ మనుషుల్లా చూసిన తరం అది. ఆ తరం లాంతర్ల కాంతితో మన జీవితాల్లో వెలుగు నింపింది. ఈ తరం కరెంటు దీపాల వెలుగులో చీకట్లను పెంచుకుంటోంది. వెళ్తున్న ఆ తరం నుంచి ప్రేమను, విలువలను, ఓర్పును, సహనాన్ని నేర్చుకోకపోతే మన భవిష్యత్తు నిజంగా అంధకారమే. వారు ఉన్నంత కాలం వాళ్లను ప్రేమగా చూసుకుందాం. వాళ్ల మాటలను ఓపికగా వినుదాం. వాళ్లు నడిచిన బాటలో కొంతైనా నడుద్దాం. పాత తరాన్ని గౌరవించండి. వాళ్లే మన మూలాలు. వాళ్లే మన బలం.
ఈ కథ మీ మనసును తాకితే ఒక్క సారి ఆ తరం మనుషుల్ని గుర్తు చేసుకోండి. వాళ్ల చేతిని ప్రేమగా పట్టుకోండి. అదే వాళ్లకు మనం ఇవ్వగలిగిన అతిపెద్ద గౌరవం.
