మాట్లాడే దేవుడు: కంచి పరమాచార్య విగ్రహ మహిమ

మాట్లాడే దేవుడు
ఈ అద్భుతమైన సంఘటన ఆంగరైకు చెందిన సత్తూర్ సుబ్రమణియన్ ఇంటిలో జరిగింది. సత్తూర్ సుబ్రమణియన్ తల్లిగారు పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తురాలు. స్వామివారంటే ఆవిడకు అత్యంత భక్తీ. తన ఇంట్లో కోటి రామనామ జపం ఏర్పాటు చేశారు సుబ్రమణియన్. సంకల్పం చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కానీ రామనామ జపానికి ఎక్కువమంది భక్తులు వచ్చేవారు కాదు. ప్రతిరోజూ కేవలం కొద్దిమంది మాత్రమే వచ్చేవారు.
జపం మొదలైన రెండురోజుల తరువాత ఒకామె జపానికి వచ్చింది. కానీ, పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఈమె ఇలా రోదించడం చూసి సత్తూర్ సుబ్రమణియన్ తల్లిగారు గాభరా పడ్డారు.
ఆమెను అనునయిస్తూ, “ఏమి జరిగింది?” అని అడిగారు.
“ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు మామి(పెద్దావిడ)” అని తన పరిస్థితిని చెప్పడం ఆరంభించింది.
ఆమె ఇంటిలో, నవరాత్రి పూజను పెద్ద ఎత్తున నిర్వహించారు. విజయదశమి తరువాత ఒక విగ్రహంను మాత్రం వదిలి మిగతా అన్ని విగ్రహంలను అటక మీద పెట్టారు. ఒక కారణం కోసం ఆ విగ్రహంని అటక పైన ఉంచలేదు. అది శ్రీ శ్రీ మహాపెరియావ విగ్రహం. అది చాలా మురికిగా ఉండి రంగు కూడా వెలిసిపోయి ఉంది. దాన్ని అటక పైన పెడితే మరుసటి సంవత్సరం విగ్రహంలకొలువుకు వాడడానికి పనికిరాదు. కనుక దాన్ని శుభ్రపరచి బాగుచేద్దామని వారి హాలులోని ఒక అలమరాలో ఉంచింది.
నవరాత్రి అయిపోయిన కొన్నిరోజుల తరువాత కోటి రామనామ జపం మొదలవ్వడంతో తను కూడా వెళ్తోంది. తను ఇంటికి తిరిగిరాగానే, కొన్ని మాటలు వినబడడం మొదలయ్యింది. వాటిని శ్రద్ధతో వినగా, “నన్ను సత్తూర్ ఇంటిలో ఇవ్వు” అని అర్థం అయ్యింది. ఆ మాటలు వచ్చిన వైపు చూస్తే, అక్కడ మహాస్వామివారి విగ్రహం తప్ప వేరేదీ లేదు.
అది తనకు కలిగిన భ్రమ అని భావించి దాని గురించి పట్టించుకోలేదు. కానీ, రోజూ తను “నన్ను సత్తూర్ ఇంటిలో ఇవ్వు” అన్న మాటలను వినడం జరుగుతోంది. అది తన భ్రమ కాదని నిజంగానే విగ్రహం మాట్లాడుతోందని అర్థం చేసుకుంది.
కాని తనకు ఏమి చెయ్యాలో పాలుపోకపోవడంతో, రెండురోజుల తరువాత రోజంతా ఆ మాటలు వినబడడం మొదలయ్యింది. అందుకే రామనామ జపం కోసం సత్తూర్ సుబ్రమణియన్ ఇంటికి వచ్చిన ఆమె ఏడ్చింది.
విగ్రహం మాట్లాడుతోంది అంటే ఎవరైనా నమ్ముతారా? అ విషయం చెప్పకుండా ఆ విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెడితే వారు ఒప్పుకుంటారా? పోనీ అది కొత్త విగ్రహం అయితే బహుశా ఒప్పుకుంటారేమో; కాని ఇది చాలా పాత విగ్రహం. ఇంటిలో ఉంచుకోవడానికి ఎలా ఒప్పుకుంటారు? ఈ విషయాన్ని వారికి ఎలా చెప్పాలో తనకి అర్థం కాక బాధతో అలా ఏడ్చింది ఆ భక్తురాలు.
కాని సుబ్రమణియన్ తల్లిగారికి పరమాచార్య స్వామివారు బ్రహ్మజ్ఞాని, సర్వాంతర్యామి అని తెలుసు కాబట్టి ఆమెను ఓదార్చుతూ అనునయంగా పలికింది.
“హే! ఆ విగ్రహం నుండి మాటలాడింది పరమాచార్య స్వామివారే. నువ్వు నమ్మడం లేదా? ఇక్కడ జరిగే రామనామ జపాన్ని పరమాచార్య స్వామివారు వినాలనుకుంటున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తాము” అని చెప్పి, అత్యంత భక్తితో ప్రపత్తులతో ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకునివచ్చారు.
ఆ విగ్రహాన్ని సత్తూర్ వారి ఇంటిలో ఉంచిన తరువాత ఆమెకు ఆ మాటలు వినబడడం ఆగిపోయింది. ఇదే అద్భుతం అయితే, ఆ విగ్రహం వచ్చిన తరువాత ఎక్కువమంది రామనామ జపానికి రావడం మొదలై దాన్ని దిగ్విజయంగా సంపూర్తి చేశారు.
— “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
