జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానలు:

ప్ర: మహిషాసుర మర్దనం చేసినది మహాలక్ష్మి అనీ, ‘దుర్గ’కాదనీ, ఈమె విష్ణుపత్ని అనీ, శైవులు ఈమెను శివపత్ని అయిన దుర్గగా చిత్రించారనీ ఒకవైష్ణవపండితుడుపుస్తకాన్ని వ్రాశారు. ఇది ఎంత మేరకు నిజం?
జ: మహిషాసుర మర్దనం చేసినది మహాలక్ష్మి. నిజమే. కానీ ఈమె విష్ణుపత్ని అయిన లక్ష్మిగా చెప్పబడలేదు. దేవీ మాహాత్మ్యం, దేవీ భాగవతం, కొన్ని తంత్రశాస్త్రాలలో
మహిషాసురమర్దిని రూపం చెప్పబడింది.
బ్రహ్మవిష్ణు రుద్రేంద్రాది దేవతలందరి నుండి లోకరక్షణార్థం వెలికివచ్చిన, సర్వదేవతాత్మక తేజఃస్వరూపిణి దుర్గ. ఈమెయే మహిషాసురమర్దనం చేసిందని స్పష్టంగా ఆ గ్రంథాలలో చెప్పబడింది. ఈమెకే ‘మహాలక్ష్మి’ అని పేరు కూడా ఉంది. మహాలక్ష్మి,ఆద్యాలక్ష్మి- అని శాస్త్రాలలో వర్ణించబడిన జగదంబ ముగ్గురమ్మలకూ మూలపుటమ్మ. ఈమెయే కాళిగా, లక్ష్మిగా, సరస్వతిగా, గాయత్రిగా పలు రూపాలలో వ్యక్తమయింది. ఈ ఆద్యాలక్ష్మి ముగురమ్మలకీ, ముగురయ్యలకీ మూలమైన పరాశక్తి.
ఈమె పరమశివుని శక్తి- అని పురాణాలు, తంత్రశాస్త్రాలు వర్ణించాయి. లక్ష్మీ సహితుడైన శివుని గురించి పేర్కొన్నాయి. ఇక్కడ ‘లక్ష్మి’ అన్నది శక్తివాచక శబ్దం మాత్రమే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి – ఈ మూడు స్వరూపాలు వేరు. విష్ణుపత్ని అయిన లక్ష్మి, బ్రహ్మపత్ని అయిన సరస్వతి వేరు. అసురశక్తుల వినాశనం కోసం ఉద్భవించిన ఈ మూడు రూపాల సమాహార స్వరూపమే దుర్గ.
మహిషాసుర మర్దనం చేశాక తల్లిని దేవతలు, ఋషులు ‘దుర్గా’నామంతో పలుమార్లు కీర్తించారు. (దేవీమాహాత్మ్యం – మార్కండేయపురాణం). మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసారా దుర్గాసి దుర్గభవసాగర నౌరసంగా, శ్రీః కైటభారి హృదయైక కృతాధివాసా గౌరీ త్వమేవ శశిమౌళి కృతప్రతిష్ఠా॥
ఆ తల్లియే విద్యాస్వరూపిణియైన సరస్వతిగా బ్రహ్మపత్ని అయినది. ఆ తల్లియే విష్ణు హృదయవాసినియైన లక్ష్మి. ఆమెయే చంద్రశేఖరుని శరీరమందున్న గౌరీదేవి.అసలు మన శాస్త్రాలలో ఒకే పరమేశ్వరుడు, ఒకే శక్తి ప్రధానం. ఆ పరమేశ్వరుడే బ్రహ్మవిష్ణురుద్రాది రూపాలలో ఉన్నప్పుడు, ఆ శక్తియే సరస్వతి లక్ష్మి దుర్గాది రూపాలతో ఉన్నదని చెప్పబడింది.
ఈ ‘దుర్గా’దేవి విష్ణువు యొక్క యోగమాయా శక్తియే. ఈమెనే, ‘విష్ణు సహోదరి’ అన్నారు. ఈ విష్ణుసోదరి శివుని పత్ని. భాగవతంలో కూడా ‘దుర్గా, కాళి’ ఇత్యాదినామాలు ఈ ‘పద్మనాభ సహోదరి’కి ఉన్నట్లుగా వివరించారు.
మహిషాసుర మర్దనం చేసిన దుర్గాదేవి ఆలయాలలో ఆమెకు పతిగా శివుని ఆలయాలే ఉండడం గమనించదగిన మరో విషయం.
‘గణేశజననీ దుర్గా’ ‘శివరూపా శివప్రియా శంభుపత్నీ’-అంటూ దేవీ భాగవతంలో స్పష్టంగా ఉంది. ‘మహాలక్ష్మి’ అనే మాట సర్వశక్తులకు మూలమైన పరాశక్తి పరంగా గ్రహించాలి. ఆమెయే పరాక్రమ స్వరూపిణి దుర్గ. విష్ణుని యోగనిద్రా శక్తి మహాకాళి.
(ఈమె విష్ణుసోదరిగా వ్యవహారం). మధుకైటభ నాశనానికి సహకరించినశక్తి.ఈమె మొదటి శక్తి. రెండవది సర్వదేవతల తేజస్సుల సమాహార రూపిణియైన మహిషాసురమర్దిని మహాలక్ష్మి. మూడవది గౌరీదేవి శరీరంనుండి వినిర్గమించిన కౌశికి, ఈమెనే మహాసరస్వతి అంటారు. ఈమె శుంభనిశుంభ సంహారిణి. వీరి ముగ్గురినీ కలిపి ఏకస్వరూపంగా ఆరాధించాలి.ఇందులో గౌరి నుండి ఉద్భవించిన తల్లిని వర్ణించారు. కానీ ఇంక ఏ స్త్రీ దేవతనుండి వచ్చిన దేవిగా వర్ణనలేదు. దీనిబట్టి గౌరియే దుర్గ అని స్పష్టమౌతుంది. అయినా ఒకే జగదంబ లక్ష్యాది రూపాలలో ఉన్నది కనుక విష్ణుపత్ని అయిన లక్ష్మినే అసురసంహారిణిగా భావించినా, ఉపాసనా పరంగా దోషంరాదు. ఇవన్నీ ఒకే దేవియొక్క రూపాలేకదా! కానీ గౌరీ స్వరూపిణి అనే శాస్త్రాధారాలను తిరస్కరించడం పాపమే.శైవవైష్ణవ ద్వేషభావాలు స్వీకార్యాలు కావు. ఆ ద్వేషంలో జనించిన పుస్తకాలు ప్రమాణాలు కావు. హిందువులు సమైక్యంగా ఉద్యమించవలసిన తరుణంలో విభేదవాదాలు సృష్టించి, భక్తుల్ని అయోమయంలో పెట్టడం దోషం.
