భార్యా శ్రేష్ఠతమా సఖా – సనాతన ధర్మంలో దాంపత్య మహిమ

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
భార్యా శ్రేష్ఠతమా సఖా…!
ప్రస్తుత సామాజిక స్థితిగతుల నేపథ్యంలో, ఈ పోస్టులోని పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు…! భారతీయ ధర్మం, వేద ధర్మం, మహాభారతం, పేర్కొన్న అంశాలుగా భావించగలరు.
భార్య గొప్పదైన స్నేహితురాలు…!
అపూర్వ నాగరికతతో ప్రపంచంలో ప్రప్రథమ సంస్కృతిని సాధించిన భారతీయ ధర్మం ఇప్పటికీ ఆ విలువలను పూర్తిగా కోల్పోలేదు. స్త్రీ-పురుష సంబంధాలపై సనాతనధర్మం తపశ్శక్తితో గొప్పవ్యవస్థను ఏర్పరచింది. ఆ ధర్మానికి మూలస్తంభం కుటుంబం. కుటుంబానికి మూలాధారం దాంపత్య ధర్మం. కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురౌతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది. భార్యాభర్తల బంధాన్ని మానవ ప్రపంచంలోనే అత్యద్భుతమైన స్నేహబంధంగా నిర్వచించారు.
“ఆర్జించిన ధనాన్ని భార్యకు అధీనం చేయాలి, ధనరక్షణ, వ్యయాలపై ఆమెయే అధికారిణి….! గృహంలో సదాచారంలోనూ, శౌచంలోనూ, ధర్మంలోనూ, ఆహారంలోనూ ఆమెకే పూర్ణ అధికారం!”- అని ధర్మప్రబోధం ఉపదేశం.
“పురుషునకు దైవమిచ్చిన స్నేహితులెవరు” – అని యక్షుడు ప్రశ్నిస్తే… “భార్య”(భార్యా దైవకృతా సభా) అని సమాధానమిచ్చాడు ధర్మరాజు.
ఈ స్నేహాన్ని చాటడానికే వివాహంలో ‘సప్తపది'(ఏడడుగులు) మంత్రాలున్నాయి.
వివాహ మంత్రాలన్నీ దాంపత్యం అనేది ఒక ‘సఖ్యం’ అని స్పష్టీకరించాయి. “ఏడడుగులు వేసి నాతో స్నేహితురాలవై ఉండు. మనం ఎప్పుడూ స్నేహితులుగానే ఉందాం. నీ స్నేహమే నాకు లభించింది. నీ స్నేహం విడవలేను. నా స్నేహం వీడకు!” – అని వివాహమంత్రాల భావం.
“ధర్మార్థ కామాలలో నిన్ను అతిక్రమించను”(నాతి చరామి) అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు వరుడు.
అసలు “పరస్పర విరోధంగా కనిపించే ధర్మార్థ కామాలను సమన్వయపరచే శక్తి భార్యకే ఉంది!”- అని మహాభారతం చెబుతోంది. అర్థకామాలు భార్య ద్వారా నెరవేరడం వల్ల అధర్మ దోషం ఉండదు. ఇలా ధర్మంతో ఆ రెండూ కలిసి పురుషుని ఉన్నతుని చేస్తున్నాయి. ఈ లోతు తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ పటిష్టపడి సవ్యమైన సమాజం సుప్రతిష్ఠితమవుతుంది….!
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
