లలితా సహస్రనామ పారాయణకు షోడశాక్షరి అవసరమా?

🌻🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🌻
👉 జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సమాధానాలు:
ప్ర: నేను లలితా సహస్రనామ పారాయణ చేస్తాను. ఈ మధ్య ఒక పుస్తకంలో లలితా సహస్రనామ పారాయణకు ముందు వేయిసార్లు షోడశాక్షరీ మంత్రజపం చేయాలన్నారు. ఆ మంత్రజపం ఏమిటి?
జ: శ్రీవిద్యకు సంబంధించిన మంత్రం షోడశాక్షరి. లలితాసహస్రనామస్తోత్రం శ్రీవిద్యలోనిదే. అందుకే షోడశాక్షరిని జపించాలి. లలితా సహస్రనామాలను పఠించాలి అని శ్రీవిద్యోపాసకుల నియమం. అలాగే బాలా, పంచదశీ – వంటి శ్రీవిద్యామంత్రాలను జపించి, సహస్రనామాలకు పారాయణ చేస్తుంటారు కొందరు. కానీ సరియైన పద్ధతిలో సరియైన గురువుద్వారా సంప్రదాయ సిద్ధంగా ఆ మంత్రాలను గ్రహించాలి. అయితే ఆ మంత్రాలను జపించాకనే లలితా నామాలను పఠించాలి అనుకోనక్కరలేదు. ఉపదేశం ఉన్నవారు కొంతసంఖ్యలో జపించి పఠించవచ్చు. ఉపదేశం లేనివారు “శ్రీమాత్రే నమః” అనే మంత్రాన్ని కుదిరినంత జపించి పారాయణ చేయవచ్చు. ఈ విషయానికి ప్రమాణంగా లలితాసహస్ర పీఠికలోనే- ‘శ్రీవిద్యాం వేత్తివా నవా’ శ్రీవిద్య తెలిసినా, లేకున్నా ఈ స్తోత్రాన్ని పఠించవచ్చని అమ్మవారి వాక్యం ఉన్నది.
అందుకే షోడశాక్షరిని జపిస్తేగానీ లలితా సహస్రం చదవరాదని అనుకోవద్దు. షోడశాక్షరి మంత్రం కోసం వెదుకులాడవద్దు.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
