homebanner

మాఘ పురాణం 18వ అధ్యాయం: ఇంద్రుని శాపవిముక్తి – మాఘస్నాన మహిమ

మాఘ పురాణం 18వ అధ్యాయం: ఇంద్రుని శాపవిముక్తి – మాఘస్నాన మహిమ

A V B సుబ్బారావు శర్మ:
AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
మాఘ పురాణం – 18 వ అధ్యాయము

ఇంద్రుని శాపవిముక్తి

శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను.” దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు, మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు, నశించును.మాఘ వ్రతము నాచరించినవారు, నాకిష్టులు. వారు దేవతలై, వైకుంఠమును చేరుదురు.

మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు, శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో, శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో, రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని దానములలో, ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము, సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ, ఇలా సర్వనదులయందును, పది సంవత్సరముల పాటు, సూర్యోదయ సమయమున, స్నానము చేసినచో, వచ్చు పుణ్యము, మూడు దినములు, అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి, పూజ మున్నగువానితో, వివిధ పుష్పములతో, సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన, మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు, దేవతలకు, మాఘవ్రత మహిమను వివరించెనుl.

దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి, యింద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి, చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.ఎంత ప్రయత్నించినను, ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని, శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి, మరునాడు మాఘస్నానాదికమును చేసి, ఆ తీర్థమును తొండపై పోసిరి.

పవిత్రోదకముచే తడిసిన తొండ, దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కరించి యిట్లు పలికెను.” నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున, నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, “మనుష్య జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి, తపమాచరించుటమేలని” తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి, నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.

నేనును బంధువుల వద్దనుంటిని, వారి నిరాదరణ ఫలితముగ, చూచువారెవరును లేకపోవుటచే, భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు, బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు, జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమననేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి, పరిహాసము చేసితిని. ధనమును దాచి, సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి, నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములను విడిచి, దురాచారవంతురాలనై, జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.

పులి, కోతి, ఎద్దు, మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును, ఆకలి కల వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన, మీరు దయయుంచి, నాకు శాపవిముక్తిని కలిగించిరి” అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే, ఆమె దేవతత్వమునంది,’ దేవప్రియ’ అను పేరును పొందెను. దేవతలలో, ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును, దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో, వికారరూపముతో తిరుగుచున్న యింద్రుని జూచి, బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలను ఇంద్రుని జూచి, వెంబడించి, వానిని ఊరడించి, ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు, మహావిష్ణువు, నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను, ఆ, ప్రకారము చేయుదము” రమ్మని, తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెనుl.

ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి, సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా, జహ్నుముని, స్వామీ! యీ విష్ణు కథామృతము, ఇంకను వినవలెననున్నది. ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు .

ధనసంపాదనము తప్ప, ధనవినియోగము నాతడు చేయలేదు. పూజ, దానము, మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత, నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి, దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై, పంపాతీరమున, మఱ్ఱిచెట్టు పైనుండి, అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి, ఆ ప్రాంతమునకు, శిష్యులతో వచ్చి, మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు, మాఘస్నానము, పూజ, మున్నగునవి చేయుచు, శిష్యులకు, మాఘమాస మహత్త్యమును, వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు, నొకనాడు, మాఘస్నానము చేసిన వారి సర్వపాపములును, సూర్యోదయమువలన చీకట్లు నశించినట్లుగా, నశించును. మాఘస్నానము చేయనివాడు నరకమునపోవును” అనుచు, మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలని శుభములను, చేయకపోవుటవలని అశుభములను, వివరించుచుండెను. ఆ సమయమున, పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము, వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు, పంపాజలమున, మాఘస్నానమును, వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన, వాని పిశాచరూపముపోయి, దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన, వైకుంఠమును చేరెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ