శివతత్త్వం తెలుసుకుంటే శివుడు ప్రత్యక్షమవుతాడు

శ్లో:// ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥
(సమస్త ఆపదలను తొలగించేవాడు, సంపదలందించేవాడు, సర్వలోకాలను ఆనందపరచేవాడు — అట్టి శ్రీరాముని నేను మరల మరల నమస్కరిస్తున్నాను.)
పవిత్ర కార్తీక మాసంలో స్కాందపురాణం వివరించిన శివతత్త్వం గురించి విచారణ చేద్దాం.
పార్వతీదేవి శివుని భర్తగా పొందేందుకు తపస్సు చేస్తుంది. ఆమెకు శివతత్త్వం అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి శివుడు బ్రహ్మచారి రూపంలో ప్రత్యక్షమయ్యాడు.
సఖులచే పరివేష్టింపబడి, చంద్రకాంతిలా ప్రకాశిస్తున్న పార్వతిని చూచి శివుడు ఇలా అన్నాడు —
“శివుడు శ్మశానవాసి, భూతప్రేతలతో తిరిగేవాడు, బూడిద పూసుకునే అమంగళుడు. నీకు సరైన వరుడు కాదు. ఈ తపస్సు విరమించు.”
పార్వతీదేవి ఆ వాక్యాలు విని కోపంతో గద్గదకంఠంతో సమాధానమిచ్చింది —
“ఓ బ్రాహ్మణా! దేవదేవుడైన శంకరుని నిందించకు. ఆయన తత్త్వం నీకు తెలియదు. విను, నేను చెబుతాను.”
శివుని తత్త్వం
శ్లో:// స ఆదిః సర్వజగతాం కోస్య వేదాన్వయం తతః ।
సర్వం జగద్యస్య రూపం దిగ్వాసాః కీర్త్యతే తతః ॥
(జగత్తుకి ఆది అయిన శివుని జన్మ, వంశం ఎవరికీ తెలియదు. జగత్తంతా ఆయన రూపమే. దిక్కులే ఆయన వస్త్రములు. అందుకే ఆయన “దిగంబరుడు”.)
శ్లో:// గుణత్రయమయం శూలం శూలీ యస్మాత్ బిభర్తి సః ।
అబద్ధాః సర్వతో ముక్తా భూతా ఏవ చ తత్పతిః ॥
(త్రిగుణములనే త్రిశూలంగా ధరించినవాడు శివుడు. జీవులను బంధనాలనుండి విముక్తం చేస్తాడు. అందుకే ఆయన ముక్తులపతిగా ప్రసిద్ధుడు.)
శ్లో:// శ్మశానం చాపి సంసారః తద్వాసీ కృపయార్థినామ్ ।
భూతయః కథితా భూతిః తాం బిభర్తే స భూతిభృత్ ॥
(శ్మశానం అంటే జననమరణ చక్రమే. శివుడు ఆ సంసారంలో దయతో ఉన్నవారిని రక్షిస్తాడు. శ్మశానవాసం అంటే వైరాగ్య సూచకం.)
శ్లో:// వృషో ధర్మ ఇతి ప్రోక్తః తమారూఢః సతో వృషీ ।
సర్పాశ్చ దోషాః క్రోధాద్యాః తాన్ బిభర్తి జగన్మయః ॥
(వృషం అంటే ధర్మం. దానిపై అధిరోహించినందున శివుడు “వృషభవాహనుడు”. దుర్గుణములను సర్పములుగా ధరించి స్వాధీనములో ఉంచుకున్నందున ఆయన “సర్పభూషణుడు”.)
శ్లో:// నానావిధాః కర్మయోగా జటారూపా బిభర్తి సః ।
వేదత్రయీ త్రినేత్రాణి త్రిపురం త్రిగుణం వపుః ॥
(వివిధ కర్మయోగాలు ఆయన జటలు, మూడు వేదములు ఆయన నేత్రములు. త్రిగుణములతో కూడిన శరీరమును భస్మం చేసేసి నిర్గుణ పరమశివుని పొందిస్తాడు.)
శ్లో:// భస్మీకరోతి తద్దేవః త్రిపురఘ్నః తతః స్మృతః ।
ఏవం విధం మహాదేవం విదుర్యే సూక్ష్మదర్శినః ॥
(త్రిగుణాత్మక త్రిపురమును భస్మం చేసి నిర్గుణ బ్రహ్మాన్ని ఇచ్చేవాడు శివుడు. అందుకే ఆయన త్రిపురాంతకుడు, పురారి.)
ఆ తరువాత పార్వతీ చెవులు మూసుకుని వెళ్ళిపోవబోతుండగా, శివుడు చిరునవ్వుతో తన స్వరూపమును దర్శనమిచ్చాడు.
శివుని దివ్యరూప దర్శనం
శ్లో:// ద్విభుజం చైకవక్త్రం చ కృత్తివాససం అద్భుతమ్ ।
కపర్దం చంద్రరేఖాంకం నివీతం గజచర్మణా ॥
(రెండు భుజములు, ఒక ముఖము, గజచర్మం ధరించినవాడు, చంద్రరేఖతో ప్రకాశించే తేజోమయ రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు.)
శ్లో:// కర్ణస్థౌ హి మహానాగౌ కంబలాశ్వతరౌ తదా ।
వాసుకిః సర్పరాజశ్చ కృతాహారో మహాద్యుతిః ॥
(కర్ణాభరణాలుగా కంబల, అశ్వతర నాగములు; హారముగా వాసుకి సర్పరాజు; శివుడు దివ్య కాంతితో ప్రకాశించాడు.)
శ్లో:// వలయాని మహార్హాణి తదా సర్పమయానిచ ।
కృతాని తేన రుద్రేణ తథా శోభాకరాణి చ ॥
(శివుడు సర్పాలతో చేసిన దివ్య వలయములను ధరించి ఉన్నాడు.)
ఈ విధంగా శివతత్త్వం పూర్తిగా గ్రహించిన పార్వతీదేవి ముందు శివుడు తన దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు.
శుభమస్తు ॥
