ధనుస్సంక్రమణం / ధనుర్మాసారంభం

తిరుప్పావై – 1వ పాశురము
శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్రానువాదముతో
అవతారిక
గోపికలు ఈ వ్రతాచరణకు అనుకూలమైన కాలం మనకు లభించిందని భావించి, ముందుగా ఆ కాలాన్ని స్తుతిస్తున్నారు.
ఈ వ్రతాన్ని ఆచరించడానికి అర్హులైనవారు ఎవరో నిర్ణయించుకుంటున్నారు.
ఈ వ్రతం ద్వారా తాము పొందదలచుకున్న ఫలం ఏమిటో,
ఆ ఫలాన్ని ప్రసాదించగల సాధనం ఏమిటో స్మరిస్తూ,
ఈ తొలి పాశురంలో అపార ఆనందంతో తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు.
తాత్పర్యము
ఓహో! ఇది మార్గశిరమాసము.
చంద్రకాంతితో నిండిన శుభదినము.
ఓ అందమైన ఆభరణాలతో అలంకరింపబడిన సఖీబాలికలారా!
ఐశ్వర్యంతో విరాజిల్లే వ్రేపల్లెలో, సంపదలతో తులతూగుచున్న గోపికలారా!
ఈ మార్గశీర్షస్నానాన్ని ఆచరించాలనే సంకల్పం ఉన్నచో రండి, ముందుకు నడవండి.
వాడియైన వేలాయుధాన్ని ధరించి, కృష్ణునికి ఏ విధమైన ఆపద కలగకుండా కాపాడే
శ్రీనందగోపుల కుమారుడైన ఆ బాలసింహాన్ని,
అందమైన నేత్రాలతో అలరారే యశోదామాత యొక్క లాలిత్యమూర్తిని,
నీలమేఘశ్యాముని, ఎర్రతామరలవంటి కళ్లుగలవాడిని,
సూర్యునివలె ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ప్రసాదించువాడిని,
దివ్యముఖమండలంతో జగత్తును మోహింపజేసే నారాయణుని —
ఆయననే తప్ప వేరొకనిని ఆశ్రయించని మనకు,
మనము కోరుకొనే ఈ వ్రతసాధనకు కావలసిన
‘పర’ అనే వాద్యాన్ని ఆయనే ప్రసాదించును.
మన ఈ వ్రతాచరణను చూసి
లోకమంతా ఆనందంతో పరవశించునట్లు,
మీరు అందరూ వచ్చి
ఈ పవిత్ర వ్రతంలో భాగస్వాములు కావలసిందిగా కోరుచున్నాము.
శుభమస్తు
శ్రీ సద్గురు పీఠం ద్వార
సమస్త లోకా సుఖినోభవంతు
